ఎన్నికలకు ముందు ప్రతి ఇంట్లోని అవ్వకు, తాతకు ఇద్దరికీ పెన్షన్ అన్నారు, ఎన్నికల తర్వాత ఒక రేషన్ కార్డుకు ఒక్కరికే అంటున్నారు. ఎన్నికల ముందు ప్రతి నెలా రూ.3000 పెన్షన్ అన్నారు, ఎన్నికల తర్వాత ప్రతి సంవత్సరం రూ.250 పెంచుకుంటూ వెళ్తామన్నారు, అది కూడా చేయడం లేదు అంటూ ఏపి ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించారు ఆంధ్రప్రదేశ్ భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి.
గతంలో 2/3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే వెసులుబాటు ఉండేది, కానీ నేడు ఏ నెలకు ఆ నెల పెన్షన్ తీసుకోకపోతే వెనక్కు లాగేసుకుంటున్నారని ఆయన అన్నారు. దూర ప్రాంతాలలో ఉండేవారికి, వారిచ్చే పెన్షన్ దారి ఖర్చులకు కూడా సరిపోవడం లేదని ఆయన విమర్శించారు.
ఆరు నెలల కాలంలో ఒక్క నెల 300 యూనిట్లు విద్యుత్ వినియోగం దాటినా, పది ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్నా, కుటుంబ సభ్యుల్లో ఎవరు ఆదాయపన్ను చెల్లించినా పెన్షన్ కట్ చేస్తున్నారని ఇదేం అన్యాయమని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి అనేక కారణాలు చెప్పి ఒక్క అనంతపురం జిల్లాలోనే ఈ నెల 20 వేలకు పైగా పెన్షన్లు కట్ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో అవ్వాతాతల, వితంతువుల, ఒంటరి మహిళల, వికలాంగుల పెన్షన్లను కట్ చేశారని తెలుస్తూ ఉంది అని ఆయన అన్నారు.
కొత్త పెన్షన్ల మాట దేవుడెరుగు,ఉన్న పెన్షన్లు ఊడకుంటే చాలురా అన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉందని ఆయన అన్నారు. అర్హులకు పెన్షన్లను కట్ చేసినా,కొత్తవి ఇవ్వకపోయినా పెన్షనర్ల తరపున బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయవలసి వస్తుందని వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నామని ఆయన అన్నారు.