తెలంగాణలో రాష్ట్రంలో వర్షకాలం పంట దిగుబడి గణనీయంగా వచ్చిందని, దిగుబడికి అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సహకరించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
సోమవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కమీషనర్ పౌరసరఫరాల శాఖ కమీషనర్ అనిల్ కుమార్, జి ఎం అశ్విన్ కుమార్ గుప్తా, రాష్ట్ర రైసుమిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి జిల్లా స్థాయి రైసు మిల్లర్ల అసోసియేషన్ నిర్వహకులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ వానకాలం 2020-21 వరి ధాన్యం కొనుగోలు సజావుగా సాగేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. సీఎం కె సి ఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా రైతులు సన్న రకాలు పండించారని పేర్కొన్నారు.
రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ర్ట వ్యాప్తంగా 6491 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 3074 కేంద్రాలను ఏర్పాటు చేసి 4.23 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసామని తెలిపారు. ఇప్పటివరకు 93 వేల మెట్రిక్ టన్నుల సన్నరకాలను, 3.30 మెట్రిక్ టన్నుల దొడ్డు రకాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు.
అకాల వర్షాల వలన సన్న రకాలకు దోమపోటుతో ధాన్యం రంగు మారిందని రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రైసు మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు సజావుగా సాగేందుకు మిల్లర్లు సహకరించాలని మంత్రి వెల్లడించారు.
రైసు మిల్లర్ల సమస్యలపై ఎఫ్.సి.ఐ. జనరల్ మేనేజర్ తో మాట్లాడి రవాణా సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. రైతులు సన్న రకాలను తక్కువ ధరకు అమ్ముకోవద్దని కోరారు.
తాలు, తప్ప లేకుండా కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. సీఎం ఆదేశాల మేరకు సన్నరకాలకు 1888 చెల్లిస్తుందని పేర్కొన్నారు.