వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని అందుకు తాము పూర్తి సహకారం అందిస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, గ్రేటర్ కమిషనర్ సృజన అన్నారు.
శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్-2021 రాష్ట్ర డైరీని జీవీ ఎంసి కమిషనర్ ఛాంబర్లో వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేసే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.
ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మహా విశాఖ నగర అధ్యక్షుడు పి. నారాయణ్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్తులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలన్నారు.
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులకు గృహ వసతి కల్పించాలని అదేవిధంగా భీమా సౌకర్యం ఏర్పరచాలని తెలిపారు. వృత్తి పరంగా అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రభుత్వ పరంగా రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా వారు కోరారు.
కోవిడ్ బాధిత జర్నలిస్టులకు ఆర్ధిక సాయం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ నగర అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, ఏపీడబ్ల్యూజెఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.రవికుమార్, ఉపాధ్యక్షుడు కె.మురళీకృష్ణ శివప్రసాద్, సంయుక్త కార్యదర్శి జి.రాంబాబు, ఫోటో జర్నలిస్ట్ పిళ్లా నగేష్బాబు, రాంబాబు , కృష్ణవేణి ,పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.