జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. కోటి వృక్షార్చనలో భాగంగా బుధవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రెస్క్లబ్లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 2 వేల మంది జర్నలిస్టులు కరోనా బారిన పడితే రూ. మూడున్నర కోట్లు అందించామన్నారు. ఇది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉండడం వల్ల పంపిణీ ఆలస్యం అవుతోందన్నారు.
సుప్రీంకోర్టుకు సంబంధం లేకుండా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇండ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులు నిరుత్సాహ పడవద్దని అల్లం నారాయణ కోరారు.
కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఇస్మాయిల్, రమణ, ప్రభుత్వ సలహాదారుడు రమేశ్ హజారే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, రాష్ట్ర నాయకులు పిన్న శివకుమార్, తడక రాజనారాయణ, మస్కపురి సుధాకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.