కరోనా కష్ట కాలంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్,డిజిల్, విద్యుత్ రేట్లు రోజురోజుకూ పెంచుతూ సామాన్య మధ్యతరగతి ప్రజల జీవనం అస్తవ్యస్తం చేస్తున్నారని CPM సూర్యాపేట జిల్లా, స్థానిక నాయకులు అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు CPM పార్టీ ఆధ్వర్యంలో నేడు నిరసన ప్రదర్శన జరిగింది.
అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల గడిచిన కొన్ని నెలలుగా ప్రజలు వారి వారి వృత్తులను నిర్వహించుకోలేక కుటుంబ పోషణ భారమై ఇబ్బందుల పాలయ్యారని అన్నారు. అరకొర వసతులతో జీవనం సాగిస్తున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ప్రవర్తించడం సమంజసంగా లేదని వారు తెలిపారు.
పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వారన్నారు. ప్రతి కుటుంబానికి పోషణ నిమిత్తం 7500 రూపాయలు వారివారి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వమే జమ చేయాలని, కరోనా వైద్య సదుపాయాలు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో ప్రభుత్వమే ఉచితంగా వైద్యం,మందులు అందచేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఈ నిరసన కార్యక్రమంలో శీతల రోషపతి,నాగారపు పాండు,పి.వెంకటరెడ్డి, యం.సీతయ్య,వీరమల్లు, జక్కుల వెంకటేశ్వర్లు, శీలం సాంబయ్య,పల్లె వెంకటరెడ్డి,కాసాని వీరస్వామి,పి.నాగేశ్వరరావు,యస్ కె సైదా,దుగ్గి బ్రహ్మం, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.