కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి గా విఫలం అయ్యాయని సీ.పీ.ఐ.యం. జిల్లా నాయకులు జిట్ట నగేష్ విమర్శించారు.
బుధవారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన నిరసన ధర్నా కు హాజరై మాట్లాడారు.
కరోనా వైరస్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ కరోనా టెస్ట్ లు చేయవలసిన పాలకులు, ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయవలసిన ప్రభుత్వాలు గుడి,సెక్రటేరియట్ వంటి భవనాలు కొత్త గా నిర్మించాలని యోచిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ప్రాణాలు కాపాడటానికి అవసరమైన విద్యా, వైద్య రంగాలను అభివృద్ధి చేయాల్సి ఉండగా, అన్ని వర్గాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే రైల్వే, బొగ్గు గనులు, విమాన యానం, టెలికాం, ఎల్.ఐ.సీ,విద్యుత్, అంతరిక్ష పరిశోధనా సంస్థ వంటి ప్రభుత్వ రంగాలను కారుచౌక గా ప్రైవేటు పరం చేస్తున్నాయని అన్నారు.
ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇవ్వడమే తప్ప, ఆచరణలో ఉన్న కొలువులు ఊడపీకారని చెప్పారు.
ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పామనుగుల్ల అచ్చాలు, మండల నాయకులు నారబోయ్న శ్రీనివాసులు, కత్తుల లింగస్వామి, శీలా రాజయ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు వెంకట్ రెడ్డి, జడల నర్సింహ, దుర్గేష్, శంకర్, బాకి అండాలు, పద్మ, నర్సమ్మ, ఎట్టమ్మ తదితరులు పాల్గొన్నారు.