అప్రతిహత విజయం సాధించి పశ్చిమ బెంగాల్ లో మళ్లీ అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీని కేంద్రంలోని బిజెపి పాలన చేయనిచ్చేలా కనిపించడం లేదు. ఎన్నికల అనంతరం జరిగిన హింసను మతంతో ముడిపెట్టి దేశం మొత్తం ట్రోలింగ్ చేస్తున్న బిజెపి ఇప్పుడు గవర్నర్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తున్నది. పశ్చిమ బెంగాల్ 28వ గవర్నర్ గా జగదీప్ ధన్ కర్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి మమతా బెనర్జీపై కత్తులు నూరుతూనే ఉన్నారు. తాజాగా బెంగాల్ లో జరుగుతున్న హింసపై ఆయన తీవ్ర మైన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుగానే తాను శాంతిభద్రతల వ్యవహారం పై హెచ్చరించానని ఆయన తెలిపారు. అయితే మమతా బెనర్జీ ఎలాంటి స్పందన చూపించలేదని ఆయన అన్నారు. హింసాత్మక సంఘటనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించాలని తాను చెప్పానని అయితే మమతాబెనర్జీ నిశ్శబ్దంగా ఉండిపోయారని దాని ఫలితమే ఈ నాటి దుస్థితి అని గవర్నర్ తెలిపారు. గవర్నర్ కార్యాలయాన్ని బిజెపి ఆఫీస్ చేశారని చాలా కాలంగా మమతా బెనర్జీ ఆరోపిస్తూనే ఉన్నారు.