అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల బిల్లుపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ సంతకం చేశారని సత్యం న్యూస్ ఈ నెల 21వ తేదీనే వెల్లడించింది. న్యాయ శాఖ తన అభిప్రాయం చెప్పేందుకు గవర్నర్ మూడు రోజుల గడువు ఇచ్చినా ఏపి న్యాయ శాఖ ఒక్క రోజులోనే క్లియర్ చేసి తన అభిప్రాయాన్ని గవర్నర్ కు చెప్పిందనే విషయం కూడా సత్యం న్యూస్ ముందుగానే వెల్లడించింది.
అనుకున్నట్లుగానే నేడు గవర్నర్ కార్యాలయం నుంచి పూర్తి స్థాయిలో క్లియరెన్స్ వచ్చేసింది. ఈ నెల 21న సత్యం న్యూస్ ప్రచురించిన వార్త యథాతధంగా ఇది:
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర?
మూడు రాజధానులు ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమం అయింది. ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇన్ క్లూజీవ్ డెవలప్ మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ బిల్లు, ఆంధ్రప్రదేశ్ కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ రీపెల్ బిల్లు లకు ఇక చట్ట రూపం రాబోతున్నది. ఈ రెండు బిల్లులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోద ముద్ర వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ బిల్లులకు సంబంధించిన న్యాయపరమైన సలహాను కూడా ఆయన తీసుకున్నారు. బిల్లులపై సంతకం పెట్టేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని న్యాయకోవిదులు సిఫార్సు చేయడంతో ఆయన ఆమోద ముద్ర వేశారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి తెలిపారు. వాస్తవానికి మూడు రోజులలో తనకు అభిప్రాయం చెప్పాలని గవర్నర్ న్యాయ శాఖను అడిగారు.
అయితే గడువుకన్నా ముందే న్యాయ శాఖ తన అభిప్రాయం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీ ఈ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించినందున, రాష్ట్ర కౌన్సిల్ లో బిల్లులు ఆమోదించినట్లు భావించినందున గవర్నర్ సంతకం పెట్టాల్సిన అనివార్యత ఉందని న్యాయ శాఖ అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర మంత్రి వర్గం సిఫార్సుల మేరకు కార్యకలాపాలు నిర్వహించాల్సిన బాధ్యత గవర్నర్ కు ఉంటుంది.
మంత్రి వర్గం సిఫార్సులను చట్ట సభలు కూడా ఆమోదించడంతో మిగిలిన అంశాల జోలికి వెళ్లకుండా ఆమోద ముద్ర వేయడం ఒక్కటే గవర్నర్ వద్ద ఉన్న మార్గం. ఒక వేళ గవర్నర్ ఈ బిల్లులను తిప్పి పంపినా మళ్లీ అసెంబ్లీ తీర్మానించి పంపితే రెండో సారి కచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది.
అసెంబ్లీలో మెజారిటీ ఉన్న ప్రభుత్వం చేసే నిర్ణయాలకు గవర్నర్ అడ్డు చెప్పే వీలు ఉండదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తన ప్రసంగంలో కూడా ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.