తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం 5.00 గంటలకు అంకురార్పణ ఘట్టం ప్రారంభమైంది. ముందుగా ఆలయ ప్రాంగణంలోనే సేనాధిపతి ఉత్సవం, ముఖ మండపంలో వేంచేపు, సమర్పణ, ఆస్థానం నిర్వహించారు. యాగశాలలో కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణం చేపట్టారు.
మే 18న ధ్వజారోహణం :
శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన మే 18వ తేదీ మంగళవారం ఉదయం 7.55 నుంచి 8.30 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు.
కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఉదయం, రాత్రి మాడ వీధుల్లో వాహనసేవల ఊరేగింపును రద్దు చేశారు. ఈ వాహనసేవలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహిస్తారు.