మానవత్వం మసకబారుతుందనడానికి ఉదాహరణే ఈ ఘటన. ఎంతో గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు, డబ్బాలు కొట్టుకోవడానికే తప్పితే ఇలాంటి ఘటనలు చూస్తే ఎందుకు వారి పథకాలు పనికిరావని చెప్పకనే చెబుతోంది. మరోవైపు రాష్ర్టంలోని ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న (ఇక్కడ తప్పక అనాల్సిందే) ప్రభుత్వోద్యోగులు సైతం నిరుపేదలపై ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరించడం వారికే చెల్లుతోంది. మరి ఇక రాష్ర్ట ప్రభుత్వం ఏం చేస్తుందయ్యా అంటే.. ఈ సంఘటన జరిగిన వెంటనే ఏదో తూతూ మమ అంటూ చర్యలు తీసుకొని చేతులు దులుపుకుంటుంది. ఇది షరా మామూలేగా అన్నట్లుగా తయారైంది. ఇక ఉద్యోగుల పరిస్థితి అయితే చెప్పనక్కరలేదు. ఓ నిరుపేద రోగి ప్రభుత్వాసుపత్రికి వస్తే సమయం అయిపోయిందని అని చెప్పి తిరిగి పంపడం.. త్రోవలోనే ఆమె ప్రాణాలు పోవడం.. డబ్బుల్లేక కనీసం ఆర్టీసీ బస్సులోనైనా ఇంటికి తీసుకువెళదామనుకుంటే.. అందుకే మళ్లీ అదే ప్రభుత్వోద్యోగులే ససేమిరా? అనడం చూస్తుంటే ఇలాంటి వ్యవహారశైలికి పాల్పడుతున్నప్రభుత్వోద్యోగులకు హ్యాట్సాఫ్ చెప్పాలి నిజ్జంగా..!
ఇక బాధితుడు చెప్పిన వివరాల్లోకి వెళదాం..
కొత్తగూడెంకు చెందిన సమ్మయ్య తన భార్య రమ (60)కి తీవ్ర అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతుంటే భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి 3 గంటలకు తీసుకువచ్చాడు. ఆసుపత్రి సిబ్బంది ఈ రోజు సమయం అయిపోయింది రేపు ఆదివారం.. ఎల్లుండి సోమవారం రమ్మని చెప్పారని బాధితుడు వాపోయాడు.. ఇక చేసేదేమీ లేక బస్టాండుకు చేరుకొని బస్సు ఎక్కుతుండగా రమ్య ఆరోగ్యం కాస్త పూర్తిగా క్షీణించి చనిపోయింది. దీంతో బస్సు ఎక్కించుకునేందుకు నిరాకరించారు. అసలే నిరుపేద కుటుంబం కావడంతోనే కదా ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు.. డబ్బులు లేకనే కదా ఆర్టీసీ బస్సు ఎక్కాలనుకున్నాడు. ఇంతలో తన భార్య ప్రాణం పోయిందని వాపోయాడు. ఆమె చనిపోవడానికి ఓ వైపు ఆసుపత్రి సిబ్బంది కారణం కాగా, మరోవైపు బస్సులో నుంచి కూడా తమను దింపేశారని వాపోయాడు.
ఏమంటారో? ఏం చేస్తారో?
ఇక చెప్పండి.. ఇంత డబ్బాలు కొట్టుకుంటున్నప్రభుత్వాలు ఇప్పుడు అతని భార్య ప్రాణాన్నిసజీవంగా తెచ్చి ఇవ్వగలవా? కేవలం ఆయా అధికారులు, సిబ్బందిపై చర్యలతో అతని గాయం మాన్పగలవా? అతనిలో ప్రభుత్వంపై నమ్మకం కలిగించగలవా? ప్రభుత్వాసుపత్రికి వచ్చి చికిత్స చేసుకుందామనుకోవడం అతని తప్పా? ఆమె చేసిన తప్పిదమా? సకాలంలో చికిత్సనందిస్తే ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకునేదేమో? ఎందుకీ నిర్లక్ష్యం.. ప్రజల సొమ్ముతో జీతభత్యాలు తీసుకుంటూ… రాజభోగాలు వెలగబెడుతున్న ఇలాంటి సిబ్బందిని, అధికారులను, ప్రభుత్వాలను ఏమనాలి? ఎందుకు అనకూడదో? ఇక్కడ సమాజం (ప్రజలంతా) ఓ సారి ఆలోచించాల్సిందే.. చెప్పుకోవడానికే శ్రీ రంగ నీతులు.. అన్నట్లుగా లేదా వీరి వ్యవహారశైలి.