జిల్లాల్లో రైతులు పండించిన పంటను ప్రణాళికాబద్ధంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని, రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల, బిసి సంక్షేమ శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్ డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుంచి మంత్రి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, పౌర సరఫరాల కమిషనర్ లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ధాన్యం కొనుగోలు అంశంపై
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా పంట విస్తీర్ణం విపరీతంగా పెరిగి, ధాన్యం దిగుబడి బాగా పెరిగిందని, రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో జిల్లా కలెక్టర్లు, అధికారులు
తీసుకున్న చర్యల కారణంగా గత సంవత్సరం కంటే అధికంగా ధాన్యం కొనుగోలు చేశామని, అయినప్పటికీ క్షేత్రస్థాయిలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. గత సంవత్సరంలో 4.5 లక్షల రైతుల నుంచి 28 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం మే 23 నాటికి 6.4 లక్షల రైతుల నుంచి 38 లక్షల 50 వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశామని, గత సంవత్సరం కంటే అధికంగా 450 కొనుగోలు కేంద్రాలు
ప్రారంభించామని మంత్రి తెలిపారు. జిల్లాలో కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని సైతం రైతులు నష్ట పోవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లాలలో రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్లోడ్ కి స్థల సమస్య ఉందని, దీనివల్ల లారీల మూమెంట్, మిల్లుల వద్ద ధాన్యం అన్లోడ్ ఆలస్యం అవుతుందని, దీనిని
నివారించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇంటర్మీడియట్ గోడౌన్లో భద్రపరచాలని, జిల్లాలో ఇంటర్మీడియట్ గోడౌన్ లను గుర్తించాలని మంత్రి ఆదేశించారు. రైస్ మిల్లుల వద్ద లోడింగ్, అన్లోడింగ్ సమస్య రాకుండా అధిక సంఖ్యలో హమాలీలు
ఏర్పాటు చేసుకోవాలని, జిల్లాల వారీగా అవసరమైతే లారీల సంఖ్యను పెంచాలని రైతుల వద్ద చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి తెలిపారు.