ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఈ రోజు ఉదయం స్విట్జర్లాండ్ లోని జ్యురిచ్ కు చేరుకుంది. దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి బృందానికి జ్యురిచ్ ఎయిర్ పోర్ట్ లో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. దావోస్ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు సారధ్యంలోని ప్రతినిధి బృందం కూడా అదే సమయంలో అక్కడికి చేరుకుంది.
జ్యురిచ్ ఎయిర్ పోర్టులో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులందరూ కాసేపు ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల బృందాలు ఫొటోలు దిగారు. దావోస్ సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్య స్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో దావోస్ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగానే భారీ పెట్టుబడుల లక్ష్యంతో పలు ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరుపనుంది.