టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు చెందిన గ్రానైట్ కంపెనీకి జగన్ ప్రభుత్వం జారీచేసిన షోకాజ్ నోటీసులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ వ్యవహారంపై చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. గొట్టిపాటి గ్రానైట్ కంపెనీలో అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇవ్వగా, గ్రానైట్ కంపెనీ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. కమిషన్ సిఫారసు మేరకు గ్రానైట్ కంపెనీకి రూ.50 కోట్ల జరిమానా విధిస్తున్నట్టు షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు.
దీనిపై గొట్టిపాటి హైకోర్టును ఆశ్రయించగా, షోకాజ్ నోటీసులను సింగిల్ బెంచ్ కొట్టివేసింది. అయితే డివిజన్ బెంచ్ ఆ ఆదేశాలను పక్కనబెట్టింది. దాంతో గొట్టిపాటి రవికుమార్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
తమ కంపెనీలో అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ కమిషన్ సిఫారసు చట్టవిరుద్ధమని రవికుమార్ పేర్కొన్నారు. వాదనలు విన్న తర్వాత ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసులను నిలుపుదల చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.