ప్రస్తుత వర్షాకాల సీజన్ లో హైదరాబాద్ నగరంలో అంటువ్యాధులు ప్రబలకుండా జీహెచ్ఎంసీ పకడ్బందీ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తోంది. ముఖ్యంగా దోమల వ్యాప్తిని అరికట్టడం ద్వారా అంటువ్యాధుల నివారణకు చర్యలు చేపట్టింది.
నగరంలోని ప్రధాన రెఫరల్ ఆసుపత్రులైన ఫీవర్, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ లలో 25మంది చొప్పున అదనపు డాక్టర్లతో అదనపు ఓపి కౌంటర్లను ఏర్పాటు చేశాం.
ఈ ఆసుపత్రులతో పాటు నగరంలో ఉన్న95 అర్బన్ హెల్త్ సెంటర్లలో ఈవీనింగ్ క్లీనిక్ లను నిర్వహిస్తున్నారు.
105 బస్తీ దవాఖానలలోనూ పూర్తిస్థాయి మందులు, సిబ్బందితో డెంగ్యు, సీజనల్ వ్యాధులపై పరీక్షలు నిర్వహిస్తున్నారు.
బస్తీ దవాఖానల్లో 200 రకాల వైద్య పరీక్షలు, 150 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేపట్టాం.
ప్రతి ఆసుపత్రిలోనూ కేవలం 60నిమిషాలలోపే ఔట్ పేషంట్ లకు పరీక్షలు నిర్వహించే విధంగా అదనపు కౌంటర్లను, డాక్టర్లను నియమించారు.
ఇప్పటి వరకు 500లకు పైగా ఉచిత వైద్య శిబిరాలను నగరంలోని హై రిస్క్ ప్రాంతాల్లో నిర్వహించారు.
జీహెచ్ఎంసీ ఎంటమాలజి విభాగంలో ఉన్న 2,375 సిబ్బంది నిరంతరం లార్వా నివారణ కార్యక్రమాలను చేపట్టడంతో పాటు నీటి నిల్వలు, అపరిశుభ్ర పరిసరాల వల్ల దోమల వ్యాప్తి ఏవిధంగా జరుగుతుందో తెలియజేసే చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ప్రతిరోజు 650 ఎంటమాలజి బృందాలు దోమల వ్యాప్తికి కారకమైన లార్వా ఉత్పత్తి కేంద్రాల గుర్తింపుకు లక్షా 40వేల గృహాలలో ఇంటింటి తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
వీటిలో దోమల ఉత్పత్తికి అనువైన ప్రాంతాలను గుర్తించి ఈ గుర్తించిన గృహాల్లో లార్వా నివారణ మందు స్ప్రేయింగ్ చేయడం ఇతర చర్యలను చేపడుతున్నారు.
ఓవర్హెడ్ ట్యాంక్లు, సంపులు, నల్లా గుంతలతో పాటు డ్రమ్లు, డబ్బాలు, కుండలు, టైర్లలో నీటి నిల్వలను తొలగిస్తున్నారు.
150 పోర్టబుల్, 10 ఫాంగింగ్ మిషన్లు కలిగిన వాహనాల ద్వారా ప్రతిరోజు 150 కాలనీలలో ఫాగింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఫాగింగ్ను నిర్వహించే ప్రతి కాలనీ, బస్తీలోని నివాసితులు, స్థానిక నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాలు, కార్పొరేటర్ల నుండి ధృవీకరణ సంతకాలను కూడా సేకరిస్తున్నారు.
గతంలో డెంగ్యు, మలేరియా కేసులు నమోదైన బస్తీల్లో ముందస్తుగా పెరిత్రియం స్ప్రేను చల్లుతున్నారు.
గతంలో నమోదైన డెంగ్యు, మలేరియా కేసుల ప్రాంతాలను జీయో ట్యాగింగ్ ద్వారా అనుసంధానించడంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
డెంగ్యు ఫాజిటీవ్ కేసులు వచ్చిన ఇళ్లను గుర్తించి ఆ ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల 50 మీటర్ల వరకు విస్తృతంగా దోమల నివారణ మందును స్ర్పే చేయడం, ఫాగింగ్ చేపట్టారు.
దోమల వ్యాప్తి వల్ల కలిగే అనర్థాలపై నగరంలోని 1800లకు పైగా ఉన్న పాఠశాలల విద్యార్థులకు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
టౌన్లేవల్ ఫెడరేషన్లు, స్లమ్లేవల్ ఫెడరేషన్లు, మహిళా స్వయం సహాయక బృందాలు, కాలనీ సంక్షేమ సంఘాలను ఈ చైతన్య కార్యక్రమాల నిర్వహణలో భాగస్వామ్యం చేస్తున్నారు.
అత్తాపూర్ నుండి చాదర్ఘాట్ వరకు గల మూసి ఇరువైపులా 126మంది సభ్యులు గల 42 లార్వా నిరోధక బృందాలచే దోమల ఉత్పత్తి నివారణకు స్ప్రేయింగ్, వ్యర్థాల తొలగింపును చేపడుతున్నారు.
గ్రేటర్ పరిధిలోని ప్రధాన చెరువుల్లో దోమలను ఉత్పత్తిచేసే గుర్రపుడెక్క ఆకును నిరంతరం తొలగిస్తున్నారు.
హైదరాబాద్ లోని చెరువుల్లో దోమల నివారణకు డ్రోన్ ల ద్వారా మందును స్ర్పే చేస్తున్నారు.
గతంలో మలేరియా, డెంగ్యు, చికెన్గున్య వచ్చిన ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి వాటిని జీఐఎస్ మ్యాపింగ్ చేసి వాటిపై తిరిగి అంటువ్యాధుల నిరోధానికి ప్రత్యేక దృష్టిని సాధించడం జరుగుతుంది.
గ్రేటర్ హైదరాబాద్ లోని 4,500 స్వయం సహాయక బృందాలలోని నాలుగున్నర లక్షల మంది మహిళలను డెంగ్యు, ఇతర అంటు వ్యాధుల నివారణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.
జిహెచ్ఎంసి వద్ద ఉన్న 10.50 లక్షల మంది ఇంటి పన్ను చెల్లింపుదారుల మొబైల్ ఫోన్లకు డెంగ్యు నివారణ చర్యలపై అవగాహన సందేశాలను పంపించడం జరిగింది.
టౌన్లేవల్, స్లమ్లేవల్ ఫెడరేషన్లు, కాలనీ సంక్షేమ సంఘాలతో అంటు వ్యాధుల నివారణకై చేపట్టాల్సిన చర్యలపై చైతన్య కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
మై జీహెచ్ఎంసి యాప్, డయల్ 100, జీహెచ్ఎంసి కాల్ సెంటర్, ఇ-మెయిల్, వాట్సప్ తదితర మాద్యమాల ద్వారా దోమల బెడద, అంటువ్యాధుల పై అందే ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించి తగు చర్యలను చేపట్టడం జరుగుతుంది.
ప్రచార సాధనాలైన ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు, రేడియోల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.
ప్రస్తుత వర్షకాల సీజన్లో డెంగ్యు, మలేరియా తదితర అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకుగాను ప్రతి శుక్రవారం రోజును డ్రై డేగా పాటిస్తూ ఖాళీ కుండలతో పాటు నీరు నిల్వ ఉండే ప్లాస్టిక్ డ్రమ్లు, డబ్బాలు, నల్లా గుంతలు, పాత టైర్లలో నీటిని తొలగించే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపడుతున్నారు.
నల్లా గుంతలు, ఓవర్హెడ్ ట్యాంక్లు, ప్లాస్టిక్ డ్రమ్లు, సిమెంట్ ట్యాంక్లు తదితర నీటిని నిల్వ ఉండేవాటిపై తప్పనిసరిగా మూతలు ఉండేవిధంగా చర్యలు చేపట్టారు.
పాఠశాలలు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, గోడౌన్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని అవగాహన కల్పించారు.
ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించేందుకు చేపట్టాల్సిన చర్యలపై దాదాపు 8 లక్షలకు పైగా కరపత్రాలను నగరంలోని బస్తీలు, మురికివాడల నివాసితులకు పంపిణీ చేయడం జరిగింది.
డెంగ్యు వ్యాధి, నివారణ చర్యలను సూచిస్తూ ఐదు లక్షల కరపత్రాలను ప్రత్యేకంగా ముద్రించి ఎంటమాలజి విభాగం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది.
డెంగ్యు వ్యాధి, వాటి నివారణపై చైతన్యపర్చేందుకు నగరంలో 50 ప్రధాన ప్రాంతాల్లో హోర్డింగ్ లను ఏర్పాటు చేస్తున్నారు.