రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు పలువురు సినీ నిర్మాతలు, నటులు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గరలోని GHMC పార్క్ లో మొక్కలు నాటారు. నిర్మాతలు కేఎస్ రామారావు, రాజ్ కందుకూరి, సింగర్ ఆర్పీ పట్నాయక్, నటులు శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్, బెనర్జీ, కాశీ విశ్వనాధ్, కందుకూరి శివ, భవానీ ప్రసాద్, కాదంబరి కిరణ్ మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ రోజు రోజుకు ఎంతో గొప్పగా సాగుతున్నదని ఇప్పటికే 5 కోట్ల మొక్కలకు పైగా నాటడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. నిర్మాత ఏడిద శ్రీరామ్ మాట్లాడుతూ పచ్చదనం పెంచడం కోసం ఎంపీ సంతోష్ తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. సినీ నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ ఎంపీ సంతోష్ పెద్ద బాధ్యత ఎత్తుకున్నారని, కోట్లాది మొక్కలు నాటడం అంత ఆషామాషీ కాదని అన్నారు. దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ సెలెబ్రెటీలను చూసి మరికొంత మంది మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవాలని పిలుపునిచ్చారు.