మూడు రాజధానులను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు సమర్థిస్తున్నారన్న విషయం ఈ ఎన్నికల ఫలితాలతో స్పష్టమవుతోందని వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు.
విశాఖపట్నం మద్దెలపాలెంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి కన్నబాబు, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు.
ప్రజలకు ఉన్న విశ్వాసం ఒక రాష్ట్ర చరిత్రను ఎలా మారుస్తుంది అన్న విషయం ఈ తీర్పుతో చాలా స్పష్టమైందని ఆయన అన్నారు.
దాదాపు రెండేళ్ల తర్వాత ప్రజలు సంతోషకరంగా, మనస్ఫూర్తిగా ఇచ్చిన తీర్పు ఇది అని విజయసాయిరెడ్డి తెలిపారు.
ఒకవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్, మరోవైపు ప్రతిపక్ష హోదా కలిగిన తెలుగుదేశం పార్టీ, ఇంకా జనసేన, సీపీఐ కలిసికట్టుగా ఎల్లో మీడియాతో కలిసి చేసిన ప్రయత్నానికి ప్రజలు ఇవాళ పెద్ద తీర్పు చెప్పారని ఆయన అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 జిల్లాలలోని 5 కోట్ల మంది ప్రజల మనసుల్లో, ఇంకా ముఖ్యమంత్రి పరిపాలన, సంక్షేమ పాలన, అభివృద్ది పాలన మనసుల్లో గూడు కట్టుకుంది అన్న విషయం తేటతెల్లమైందని ఆయన అన్నారు.