చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగాదాలతో కూనారిల్లిపోతున్నది. ఒకరినొకరు అణచివేసేందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు ఈ విషయాలు తెలుసో తెలిదో కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాత్రం తమ పార్టీలోని గ్రూపు తగాదాలపై సంచలన ఆరోపణలు చేశారు.
శనివారం చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి వైఎస్ఆర్సీపీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏ మంత్రికి లేనన్ని బాధలు తనకు ఉన్నాయని ఆయన అన్నారు.
తనపై పార్టీ పరంగా చాలా ఒత్తిడి ఉందని ఆయన అన్నారు. ఎంత వినయంగా పోతున్నా పార్టీలోని గ్రూపు రాజకీయాలతో తనను ఇబ్బందులు పెడుతున్నారని డిప్యూటీ సిఎం వాపోయారు.
గ్రామం నుంచి కొందరిని తరిమేయాలంటే ఎలా? ఎక్కడైనా ఇలాంటి చట్టం ఉందా? అని సొంత పార్టీ నేతలను ఆయన నిలదీశారు. మీరు వద్దంటే రాజకీయాల నుంచి తప్పుకొంటానని, మీ ఇష్టం చెప్పండంటూ సొంత పార్టీ నేతల ముందు వాపోయారు.