ఇటీవలి విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల కలయికకు పరిశీలకులు ఊహించిన స్థాయిలో ఎటువంటి ప్రాధాన్యత లభించలేదు. దీనికి కారణం…వారిద్దరి మధ్య జరిగిన రహస్య సమావేశంలో ఏ ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనే విషయంపై ఇద్దరిలో ఏ ఒక్కరూ ప్రకటించకపోవడం.
సమావేశం అనంతరం, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు తనకు తెలిసినంత వరకు ప్రధానితో చెప్పానని, రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయని ప్రధాని అన్నారని మాత్రమే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మీడియాకు ముక్తసరిగా వెల్లడించారు. కానీ..ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి అనేది చెప్పకుండానే ఆయన దాటవేశారు. దీనితో వారి మధ్య జరిగిన సమావేశంపై అనేక ఊహాగానాలు రాజకీయ వర్గాలలో, మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎవరికి తోచిన రీతిలో వారు ఊహించుకొని అనేక అంశాలు తెరపైకి తెస్తున్నారు. వాటిల్లో…అధికార పార్టీ వైయస్ఆర్ సీపీకి, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి సమాన దూరం పాటించాలని ప్రధాని పవన్ కళ్యాణ్ కు సూచించి ఉంటారనేది ఒకటి.
తెదేపాతో పొత్తు లేకుండా బీజేపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్ళలనేది బీజేపీ వ్యూహం అని వైసీపీ అనుకూల పరిశీలకులు భాష్యం చెబుతున్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను బలహీన పరచి అధికార తెరాస కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదగాలన్న ఎత్తుగడనే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అమలుచేయడానికి ఆ పార్టీ కృత నిశ్చయంతో ఉందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీని నిర్వీర్యం చేసి, రానున్న ఎన్నికల్లో వైకాపా కు దీటైన ప్రత్యామ్నాయంగా ప్రజల ముందు నిలబడాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ , బీజేపీ మధ్య పొత్తు ధర్మంతో రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాలకు పోటీ చేయడానికి రోడ్ మ్యాప్ సిద్ధమైనట్లు వైసీపీ అనుకూల మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
అధికార వైకాపా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని భీషణ ప్రతిజ్ఞ చేసిన పవన్ కల్యాణ్ కు ఈ పరిణామం ఆందోళన కలిగించేదే. 2014 ఎన్నికలలో 50 పైగా ఓట్ల శాతంతో అధికారం చేజిక్కించుకున్న వైకాపా ను ఎదుర్కోవాలంటే 40 శాతం పైగా ఓట్లు ఉన్న తెదేపాతో పొత్తు తప్పదని జనసేన పార్టీ ఆశిస్తున్నట్లు ఒక ప్రచారం. అయితే…ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లు తెదేపాకు దూరంగా ఉండి బీజేపీతో చేతులు కలపడానికి జనసేన పార్టీ ఎంతవరకు ముందుకు వస్తుంది అనేది రానున్న రోజుల్లో తేలాల్సిఉంది.
పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ సామాజిక విశ్లేషకుడు