మెట్రో రైలు సేవలను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మెట్రో రైలు ఎక్కే ప్రయాణికులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. మెట్రో రైలు ఎక్కిన తర్వాత తప్పని సరిగా భౌతిక దూరం పాటించాలి.
ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి విడుదల చేశారు. కంటైన్మెంట్ జోన్లలోని స్టేషన్లు మూసివేసే ఉంటాయని ఆయన వెల్లడించారు. మార్గదర్శకాలు ఇవి: మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి. లేకపోతే స్టేషన్లోకి అనుమతించరు.
స్టేషన్లు, ప్లాట్ ఫాం, మెట్రోలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. డబ్బులు చెల్లించి తీసుకునేందుకు అన్ని మెట్రో స్టేషన్లలో మాస్క్ లు అందుబాటులో ఉంచాలి. ఎటువంటి లక్షణాలు లేని వారిని శరీర ఉష్ణోగ్రత పరిశీలించాకే లోనికి అనుమతిస్తారు.
అన్ని ప్రవేశ, నిష్క్రమణలు, లిఫ్ట్ లు, ఎస్కలేటర్ల ప్రదేశాల్లో శానిటైజర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. నేరుగా డబ్బు చెల్లించే అన్ని పద్ధతులు నిలిపివేయాలి. అత్యంత తక్కువ లగేజ్ను ప్రయాణికులు తీసుకురావాలి. రైళ్లలో ఏసీ సరఫరాలో గాలి మారేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలి.
ప్రయాణికులకు అవగాహన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. మెట్రో రైలు కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వం సహా స్థానిక పాలనా సిబ్బంది, పోలీసులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. మెట్రో స్టేషన్ల వద్ద రద్దీ లేకుండా చర్యలు చేపట్టాలి.