2019 పౌరసత్వం (సవరణ) చట్టం (సిఏఏ) ను అమలు చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంకా నియమాలను రూపొందించలేదు. దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైన ఈ చట్టాన్ని డిసెంబర్ 11 న పార్లమెంట్ క్లియర్ చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ లాంటి దేశాలలో మతపరమైన హింసను ఎదుర్కొన్న వారి గుర్తింపును ఖరారు చేయడానికి అమలు చేయాల్సిన ప్రక్రియను నిర్వచించడం “కష్టం” అని అధికారులు భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
“మేము ఈ సమస్యను నిశితంగా పరిశీలిస్తున్నాము” అని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి ముస్లింలు కాకుండా మిగిలిన మతాల వారు అంటే హిందువులు, సిక్కులు, జైనులు, పార్సీలు మత హింసకు గురై శరణార్థులుగా భారత్ వస్తే వారికి పౌరసత్వం ఇచ్చేందుకు ఈ సిఏఏ నిర్దేశించారు. అయితే వారి నుంచి ఆ విషయాలను ధృవపరచుకోవడం ఎలా అనేది ఇప్పుడు నిబంధనలు రూపొందించేందుకు అడ్డువస్తున్నట్లు తెలిసింది.
వారు ఇచ్చిన డిక్లరేషన్ ను నమ్మడం మినహా ధృవపరచుకోవడానికి మరెలాంటి నిబంధనలు రూపొందించాలో అర్ధం కావడం లేదు. సిఏఏ పై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. సిఏఏ రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు వాదిస్తున్నారు.
అయితే సుప్రీంకోర్టు తీర్పు కోసం తాము వేచి చూడటం లేదని, అన్ని సమగ్రంగా పరిశీలించి పటిష్టమైన నిబంధనలు రూపొందించేందుకే జాప్యం జరుగుతున్నదని అధికారులు అంటున్నారు. పిటిషన్లను జనవరి 22 న సుప్రీం కోర్టు విచారించనుంది.