బిజెపికి లభించిన ప్రజా మద్దతు భారతదేశ యువత ఆలోచనలకు అద్దం పట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా అతి పెద్ద, కఠిన నిర్ణయాలు తీసుకునే శక్తి బీజేపీకి ఉంది కాబట్టి ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ఆయన అన్నారు. ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి వీలైనంత త్వరగా అన్ని సౌకర్యాలు కల్పించాలని బీజేపీ కోరుకుంటున్నందున ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. గుజరాత్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
గుజరాత్లో బీజేపీ మెజారిటీ మార్కును అధిగమించి అఖండ విజయం సాధించింది. బీజేపీ ఆవిర్భావం తర్వాత సాధించిన అతిపెద్ద విజయం ఇదేనని ఆయన అన్నారు. ‘ధన్యవాదాలు గుజరాత్, అపూర్వమైన ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత నేను చాలా భావోద్వేగాలతో మునిగిపోయాను. అభివృద్ధి రాజకీయాలను ప్రజలు ఆశీర్వదించారు. నేను గుజరాత్ ప్రజాశక్తికి సెల్యూట్ చేస్తున్నాను అని ఆయన అన్నారు.
‘గుజరాత్ బీజేపీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. పార్టీకి అసలైన బలం కార్యకర్తలే’ అని ఆయన అన్నారు. వేదికపై ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. గుజరాత్లో ఘనవిజయం సాధించినందుకు కార్యకర్తలకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కృతజ్ఞతలు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ఓటమిని అంగీకరిస్తూ అక్కడి రెండు పార్టీల మధ్య ఒక శాతం కంటే తక్కువ తేడా మాత్రమే ఉందని జేపీ నడ్డా అన్నారు. గుజరాత్ ఫలితాలు చూస్తుంటే ప్రధాని మోదీ నాయకత్వ పటిమ వ్యక్తం అవుతున్నదని అన్నారు.