విధి నిర్వహణలో మరణించిన పోలీసుల కుటుంబాలకు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని నేడు పోలీస్ వెల్ఫేర్ ఫండ్(Police Welfare Fund) చెక్కులను అందచేశారు. రూరల్ జిల్లా పరిధిలో కోవిడ్ మహమ్మారి బారిన పడి 13 మంది పోలీసులు మరణించారు. ఒక్కొక్క పోలీస్ కుటుంబానికి పోలీస్ సంక్షేమ నిధి(police welfare fund) నుండి రూ.5 లక్షల చెక్కులను ఆయన అందచేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయములో ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు పోలీసులు ప్రాణాలను కూడా పణంగా పెట్టి పని చేశారని తెలిపారు. కరోనాతో మరణించిన పోలీసుల కుటుంబాలకు కొండంత అండ గా పోలీసు శాఖ ఉంటుందని ఆయన తెలిపారు.
ప్రజా రక్షణే ప్రధమ కర్తవ్యంగా విధులు నిర్వహించి, మరణించిన వారి త్యాగం ఎనలేనిదని ఆయన అన్నారు. ఆ భగవంతుడు వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూర్చి, వారి కుటుంబాలకు మనో ధైర్యాన్ని కలిగించాలని కోరారు. ఈ కార్యక్రమములో ఎస్పీతో పాటు రూరల్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారి(AO) శివ ప్రసాద్, సంక్షేమ నిధి అధికారి మహిళా ఆర్ఎస్సై కల్పన, పోలీస్ సంఘ అధ్యక్షుడు మాణిక్యాలరావు పాల్గొన్నారు.