చేనేత కార్మికుల, చేనేత పరిశ్రమకు సంబందించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలనుండి వచ్చే సమస్యలను చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి 1992 లో ఏర్పాటు చేసిన ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏక పక్షంగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రద్దు చేయటాన్ని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ మాట్లాడుతూ 1985వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత నూతన జౌళి విధానం ప్రవేశపెట్టారని అన్నారు.
1992లో ఏర్పడిన బోర్డు ఇది
అంతర్జాతీయ మార్కెట్లో పోటీకి తట్టుకోవాలంటే ఆధునీకరణ అవసరమని అందుకు షటిల్ లెస్ ఎయిర్ జెట్ లూమ్స్ విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలని {టఫ్} టెక్నాలజీ అప్గ్రేడ్ ఫండ్ క్రింద 25 వేల కొట్ల రూపాయలు కేటాయించినపుడు ఇది చేనేత పరిశ్రమ మనుగడకు కష్టం అని దేశవ్యాప్తంగా చేనేత వర్గం ఆందోళనలు నిర్వహించాయని ఆయన అన్నారు.
చేనేత సమస్యలు పరిష్కరించడానికి ఒక బోర్డు అవసరమని ఆందోళనలు జరిగిన నేపథ్యంలో 1992 లో అఖిల భారత చేనేత బోర్డు ఏర్పారు చేశారని ఆయన తెలిపారు. అన్ని రాష్ట్రాల నుండి అందులో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వారిని సభ్యులుగా తీసుకుని బోర్డుని నడుపుతున్నారు.
వారు తమ రాష్ట్రాలలో ఉన్న చేనేత సమస్యలను తెలుసుకొని బోర్డు సమావేశం దృష్టికి తెచ్చేవారు. ఆ విధంగా చేనేత సమస్యలు పరిష్కారానికి కృషి చేసేవారు. ఇప్పుడు బోర్డు రద్దుతో చేనేత సమస్యలు చర్చకు అవకాశం లేకుండా పోయింది.
వాజ్ పేయి సమయంలోనూ ఇలాగే చేశారు
గతంలో బీజేపీ ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజపేయి అధికారంలో ఉండగా చేనేతను ధ్వంసం చేయాడాదికి సత్యం కమిటీ సిఫారసులు {చేనేతకు అవసరమైన చిలపనూలు తయారు చేయరాదని} అమలు జరిపి చేనేతను ధ్వంసం చేశారు.
అయినా చేనేత బ్రతికే ఉంది. ఇప్పుడు నరేంద్రమోడీ మొదటి సారి అధికారానికి వచ్చిన తరువాత చేనేత పరిశ్రమ రక్షణకు కట్టుబడి ఉన్నామని తమిళనాడులో జాతీయ చేనేత దినోత్సవం ఆర్భాటంగా జరిపి భరోసా ఇచ్చారు. కానీ ఆచరణలో తన మంత్రి వర్గంలో ఉన్న, తన ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న పవర్ లూమ్ యజమానులకు వేలకోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారని అన్నారు.
వారి ఆదేశానుసారం చేనేతకు సమాధికట్టడం కోసమే ఆలిండియా బోర్డు రద్దు చేయటం తప్ప మరొకటి కాదు. ఈ బోర్డు రద్దు చేయటంతో చేనేత సమస్యలు చేనేత జౌళి మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్ళటానికి అవకాశమేలేదు. బోర్డు ఉన్నప్పుడే చేనేత సమస్యల పరిష్కారానికి ఎన్నో ఆందోళనలు చేయాల్సివచ్చేది.
చిన్న పాటి అవకాశాలు కూడా దూరం చేస్తారా?
ఈ బోర్డు రద్దుతో ఆ ఉన్న చిన్నపాటి అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇకనుండి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా రాష్ట్రాలు వ్యవహరించాలి తప్ప రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకొనే అవకాశం ఉండదు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ప్రాంతీయ పార్టీలు దాసోహం అనటం తప్ప కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే పరిస్థితి లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతకు సమాధి కట్టి పవర్ లూమ్ యజమానులకు కొమ్ముకాస్తున్నారు తప్ప చేనేత రక్షణకు చర్యలు తీసుకోరనేది నిర్వివాదాంశం.
కనుక చేనేత రక్షణకోసం ఆలిండియా బోర్డు ను పునరుద్ధరించాలని పిల్లలమర్రి బాలకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేసారు.