మునిసిపల్ ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. టీపీసీసీ కార్యదర్శి పార్టీకి రాజీనామా చేసి గులాబీ కారెక్కారు. అది కూడా మంత్రి హరీశ్ రావు సమక్షంలో. బుధవారం మెదక్ జిల్లాకేంద్రంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
మెదక్ పట్టణానికి చెందిన టీపీసీసీ కార్యదర్శి బట్టి జగపతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రి హరీష్ రావు సమక్షంలో తన అనుచరులతో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు బట్టి ఉదయ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు గోదల సాయిరాం తదితరులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరంతా హరీశ్ రావు చేతుల మీదుగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇప్పటికే కుదేలైపోయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ ఎన్నికల్లో అయినా చెప్పుకోదగిన స్థానాలను గెలుపొంది పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపుదామనుకుంటే పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
జగపతి చేరిక సందర్భంగా హరీశ్ రావు కేసీఆర్ పాలనను పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ ఆదర్శవంతమైన పాలనను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్ పథకాలను పొగుడుతుంటే ఇక్కడి నేతలు ఎన్నికల ప్రయోజనం కోసం విమర్శిస్తున్నారని అన్నారు హరీశ్.