న్యాయ వ్యవస్థ ను కించపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు మంచిది కాదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజ్యాంగ నిపుణుడు హరీష్ సాల్వే అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చే తీర్పులను ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ నాయకులు విమర్శిస్తున్న తీరు చూస్తుంటే ఆందోళన కలుగుతున్నదని ఆయన అన్నారు.
సీఏఎన్ ఫౌండేషన్ నిర్వహించిన చర్చావేదికలో ఆయన పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించేవారే న్యాయ వ్యవస్థను గౌరవించకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థను కించ పరిచే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అధికార వైసీపీ న్యాయవ్యవస్థ పై చేస్తున్న దాడి జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోర్టులంటే లెక్కలేనితనం న్యాయ నిపుణులలో చర్చలలోకి వస్తోంది. తన వాదనా పటిమతో అంతర్జాతీయ కోర్టు ను ఒప్పించి పాకిస్తాన్ లో బందీగా వున్న భారతీయుడిని విడిపించిన న్యాయ కోవిదుడు హరీష్ సాల్వే. ఆయన గతంలో ముకుల్ రోహత్గి తో పాటు జగన్ మోహన్ రెడ్డి బెయిలు కోసం సుప్రీంకోర్టులో వాదించిన ప్రముఖ న్యాయవాది కావడం గమనార్హం.