రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రచారం చేస్తూ చెబుతున్న విషయాలు హాస్యాస్పదంగా ఉన్నాయని వికారాబాద్ జిల్లా TJAC చైర్మన్ ముకుంద నాగేశ్వర్ అన్నారు. సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి హుజురాబాద్ లో జరగలేదు అని పదే పదే ప్రజలకు చెబుతున్న మంత్రి హరీష్ రావు గత ఏడేళ్లలో పరిగి నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేటలో నాలుగు వేల డబల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించినట్లు చెబుతున్న హరీష్ రావు, పరిగి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రజలకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
సిద్దిపేటలో ఏర్పాటై కొనసాగుతున్న హైటెక్ రైతు బజార్ తరహాలో పరిగిలో 2015లో అప్పటి మంత్రి మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదో చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. సిద్దిపేటలో ప్రభుత్వ వైద్య కళాశాల పూర్తి చేసుకున్న హరీష్ రావు, వికారాబాద్ జిల్లాకు ఇప్పటివరకు కనీసం ఏర్పాటుకు అనుమతులు ఎందుకు మంజూరు చేయించలేదో వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. పూర్వ రంగారెడ్డి జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామంటూ ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్ చేసి మూడేళ్ళలో కాళేశ్వరం ద్వారా సిద్ధిపేటకు నీళ్లు తీసుకపోయిన పాలకులు, ఏడేళ్లయిన గోదావరి నది నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుండి, క్రిష్ణా నది నీటిని పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పూర్వ రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదో సమాధానం ఇవ్వాలని ఆయన కోరారు.
హైదరాబాద్ నుండి సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు నాణ్యమైన డబుల్ రోడ్లు వేసుకున్నట్లుగా హైదరాబాదు నుండి సమీపంలో ఉన్న తాండూర్, వికారాబాద్, పరిగి ప్రాంతాలకు డబల్ రోడ్లను ఇప్పటివరకు ఎందుకు అభివృద్ధి చేయలేదో ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. పరిగి ప్రాంత ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్తులేనని అయితే స్వరాష్ట్ర అభివృద్ధి ఫలాలు తమ ప్రాంత ప్రజలకు అందడం లేదని ఆయన అన్నారు. నీళ్లు, నిధులు మరియు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో, గోదావరి నది నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణకు, నియామకాలు కెసిఆర్ కుటుంబ సభ్యులకు, నిధులు ఎక్కువగా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజక వర్గాల అభివృద్ధికి తరలించుకుపోతే తెలంగాణ అభివృద్ధి జరిగినట్లుగా చెప్పడం ఎంత వరకు సమంజసమో పాలకులే ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.