లాక్ డౌన్ నేపథ్యంలో ఆలయాలు మూతపడటంతో అర్చకులు, పెళ్లిళ్లు లేకపోవడంతో పౌరోహితులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఇబ్బందుల్లో ఉన్న సుమారు ఎనభై మంది అర్చకులు, పౌరోహితులకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నేతృత్వంలో మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా నిత్యావసర సరుకులను అందజేశారు.
జిల్లా కలెక్టరేట్ భవసముదాయంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో జహిరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబి పాటిల్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లు పాల్గొన్నారు. ముందుగా వేద బ్రాహ్మణులందరూ కరోనా మహమ్మారి నాశనమై దేశమంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ వేదాశీర్వచనములను చేశారు.
జిల్లా బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి రామారావు దేశ్ పాండే, సంగారెడ్డి మండల బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కులకర్ణి రమేష్ రావు ఆధ్వర్యంలో సంగారెడ్డి మండలంలోని సుమారు ఎనభై మంది అర్చకులు, పౌరోహితులు, పేద బ్రాహ్మణులు తరలివచ్చి మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా నిత్యావసర సరుకులను అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు జి. వసంతరావు, పాండురంగారావు, పి. వసంతరావు తో పాటు పలువురు బ్రాహ్మణ బంధువులు పాల్గొన్నారు.