తెలంగాణలో రైతులు అప్పులపాలు కావొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారని రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావు అన్నారు. అందుకే వ్యవసాయానికి కరెంటు మీటర్లు పెట్టొద్దని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని ఆయన వెల్లడించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు నేడు పర్యటించారు. ఈ సందర్భంగా పెద్ద చీకోడ్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బావులు, బోర్లకు మీటర్లు పెట్టాలంటున్న బీజేపీకి సమాధానం చెప్పే అవకాశం దుబ్బాక ప్రజలకు వచ్చిందని అన్నారు.
కేంద్రం ఇచ్చే డబ్బుల కోసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రైతుల కరెంటు మోటార్లకు బిగించేందుకు సిద్ధపడ్డారని హరీష్ రావు అన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని, మోడీ ప్రభుత్వంలోని కేంద్రమంత్రి ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాజీనామా కూడా చేశారని హరీష్ రావు అన్నారు.
మీటర్లు పెట్టాలని, ఆఫ్రికా మక్కలు దిగుమతి చేసుకోవాలనుకుంటున్న బీజేపీకి బుద్ది చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.
ఆఫ్రికా మక్కలు తెస్తే తెలంగాణ రైతు మక్కలు ఎవరు కొంటారు? అందుకే తెలంగాణ ప్రజల తరపున దుబ్బాక ప్రజలు తమ ఓటు తో బీజేపీని దెబ్బకొట్టాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. 28 రాష్ట్రాలలో రైతు కోసం ఆలోచించిన నేత మన సీఎం కేసీఆర్. 18 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఎక్కడైనా ఉచితంగా కరెంటు ఇచ్చారా.. ఇంటింటికీ తాగునీరు అంరించారా..అని ఆయన సూటిగా ప్రశ్నించారు.