భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికార బలం ఉపయోగించి కాశ్మీరీల స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి కాలరాసిన నరేంద్రమోడీ అక్కడి కాశ్మీరీలను అణచి వేసేందుకు త్రిముఖ వ్యూహం రూపొందించారని ఆయన అన్నారు.
ముందుగా కాశ్మీర్ కు హిందూ పండిట్లను పంపించి అక్కడ వారి జనాభాను పెంచడం ద్వారా కాశ్మీరీలను తక్కువ చేయాలని నరేంద్రమోడీ పథకం పన్నారని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్ లో నిరంకుశంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.
జమ్మూ కాశ్మీర్ ప్రజలు స్వేచ్ఛగా తిరగాలని అనుకుంటుంటే నరేంద్రమోడీ తన అధికార బలాన్ని ఉపయోగించి అక్కడ కరోనా పేరుతో లాక్ డౌన్ అమలు చేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. కరోనా కష్ట కాలంలో కాశ్మీరీలకు మందులు, ఆహారం కూడా దొరకడం లేదని ఆయన అన్నారు.
కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా లాక్ డౌన్ అమలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. భారత ప్రభుత్వం అమాయకులైన కాశ్మీరీ యువకులను భారీ ఎత్తున అరెస్టు చేస్తున్నదని, వారి గొంతు ప్రపంచానికి వినిపించకుండా చేస్తున్నదని ఆయన అన్నారు.