శ్రీ సమ్మక్క, సారలమ్మ మినీ మేడారం జాతర కోసం ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. నేటి నుండి 31 జనవరి వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, ఫిబ్రవరి 1 నుండి 5వ తేదీ లలో 24 గంటల వైద్యం అందుబాటులో ఉండేటట్లు ప్రణాళిక సిద్ధం చేశారు. భక్తుల ఆరోగ్య సౌకర్యార్థం ఈరోజు ఆలయ ప్రాంగణం లోని TTD కళ్యాణ మండపంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరఫున, 10 లక్షల రూపాయల విలువ గల ఔషధాల సామాగ్రి, 50,000 మాస్కులతో, ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనదేవతల ప్రధాన పూజారి జగ్గారావు, సిద్ధ బోయిన స్వామి, సిద్ధ బోయిన సురేందర్ విచ్చేశారు. పాలకాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వీరితో పాటు సిద్దబోయిన స్వామి, సిద్దబోయిన సురేందర్ వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా DM &HO Dr అప్పయ్య మాట్లాడుతూ, జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్య శిబిరాన్ని చేరుకొని ఉచిత వైద్యం పొందాలని కోరారు. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలని, శుద్ధి చేసిన నీటినే త్రాగాలని, దగ్గు, జలుబు, చిరు వ్యాధులు లకు చికిత్స తీసుకోవాలని కోరారు. కరోనా వంటి వ్యాధులనుండి కాపాడుకోవడానికి అందరూ తప్పకుండా మాస్కులు ధరించాలని ఈ సందర్బంగా ప్రజలకు సూచించారు.