విజయనగరం జిల్లా కేంద్రం లోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. ఈ మేరకు ఒక్క రోజు ముందు పరేడ్ గ్రౌండ్ లో కుండపోతగా వర్షం పడుతున్న వేడుకలు ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్, డీఆర్ఓ గణపతిరావు ల ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు.
జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. ఈ నెల 15 వ తేదీ ఉదయం 9-00 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలు తమ ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేడుకల సందర్భంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లతో సిద్ధమయ్యాయి.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో కరోనా నిబంధనల మేరకు వేడుకలకు పరిమిత సంఖ్యలో ఉద్యోగులు, అధికారులను అనుమతిస్తున్నారు. కరోనా నిబంధనల మేరకు స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను పరిమితం చేశారు. ఈ ఏడాది శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటుకు బదులుగా ఆయా ప్రభుత్వ శాఖల ప్రగతిని తెలిపేలా ఫ్లెక్సీ లు ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ పెరేడ్ పరిశీలన అనంతరం ముఖ్య అతిథి మైదానంలో వరుసగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను సందర్శిస్తారు.
ప్రతి ఏటా ఉత్తమ సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ప్రశంసా పత్రాలను ఈ ఏడాది కోవిడ్ విధుల నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి పరిమితం చేస్తున్నారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న 75వ స్వాతంత్ర్య వేడుకలను కరోనా తో మృతి చెందిన వారికి అంకితం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఇప్పటికే ప్రకటించారు. కరోనా దృష్ట్యా అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులకు జిల్లా కలెక్టర్ ఇచ్చే తేనీటి విందు ఎట్ హోమ్ కార్యక్రమం కూడా రద్దు చేశారు.
స్వాతంత్ర్య వేడుకల నిర్వహణ పై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, ఎస్.పి. దీపిక సమీక్షా సమావేశాలు నిర్వహించి సూచనలు చేయడంతో పాటు పోలీసు పెరేడ్ మైదానాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ పై జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ భారీ వర్షంలోనే ఏర్పాట్లను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, ఆర్.డి.ఓ. భవానీ శంకర్ తదితరులు పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. వర్షం కారణంగా ఏర్పాట్లలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ జిల్లా అధికారులు ఏర్పాట్లను వర్షంలోనే చేస్తున్నారు.
ఈ 75వ స్వాతంత్ర్య వేడుకలను స్థానిక కేబుల్ టీవీ నెట్ వర్క్ లు, యూ ట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి కూడా ఏర్పాట్లు చేశారు.