ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఉంచి నియోజకవర్గం ఆకివీడు, కాళ్ల ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానిక కాలనీల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఏలూరులో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రహదారులపై నీరు చేరడంతో పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
అమరావతి ప్రాంతంలో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. తూళ్లురు మండలం, పెద్దపరిమి వద్ద రోడ్డుపై కోటేరుల వాగు పొంగి ప్రవహిస్తోంది. రాజమండ్రి ప్రధాన రహదారిలో ఉన్న పురాతన భవనం గోడ కూలిపోయింది. దీంతో ట్రాన్స్ఫామ్తో ఉన్న విద్యుత్ స్తంభం నేలకొరింది. జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.