కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురియడంతో బిచ్కుంద మండలంలోని కందర్పల్లి, గుండె కల్లూరు,మెక్కా, సెట్లూరు ఖత్గావ్ పంట చేలన్నీ నీట మునిగాయి. రాకపోకలు పలు గ్రామాలకు స్తంభించాయి.
120మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. బిచ్కుంద నుండి రాజులకు వెళ్లే దారిలొ గల వాగు మళ్లీ వర్షం ధాటికి కొట్టుకుపోయింది. జుక్కల్ మండలంలోని జుక్కల్ నుండి నాగల్గావ్ వెళ్లే దారిలో ఉన్న వాగు కొట్టుకుపోయింది.
మండలంలోని మెక్క గ్రామం చుట్టూ నీరు చేరడంతో జలదిగ్బంధంలో చిక్కుకుంది.సెట్లుర్, ఖత్గావ్ గ్రామాల మధ్య వరద నీరు భారీగా చేరడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమై వరదనీటి ప్రాంతాన్ని పరిశీలించారు.
వరద నీటి నుండి ఎవరిని కూడా అటు వైపు వెళ్లకుండా పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వాగులో నుండిగాని వరదనీటిలో నుండిగాని ప్రజలెవ్వరూ దాటే ప్రయత్నం చేయరాదన్నారు.
ఖత్గావ్ సెట్లూరు గ్రామాలలో వేసిన వరి పంట పూర్తిగా నీట మునిగిపోయింది. ఇతర పంట చేలలో వేసిన సోయా పంటకు కూడా పూర్తిగా నీట మునిగాయి. దీంతో రైతన్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి అంటున్నారు.
జీ.లాలయ్య, జుక్కల్, సత్యం న్యూస్