హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం ర్యాలీని తిరుపతి జిల్లా యస్.పి డాక్టర్ గజరావు భూపాల్ అలిపిరి గరుడ సర్కిల్ నుండి జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, వాహనదారులు రక్షణ పొందడమే కాకుండా వారిపై ఆదారపడిన వారిని కూడా రక్షించినవారవుతారని అన్నారు.
హెల్మెట్ వాడటం వలన రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్య తగ్గవచ్చునని ఆయన అన్నారు. ప్రమాదాలలో మరణానికి 90% తలకు గాయాలు కావడం వల్లే సంభవిస్తున్నాయని ఆయన వివరించారు. జనవరి ఒకటి నుండి ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, నిబంధనలను పాటించని వారికి జరిమానా తప్పదని ఆయన హెచ్చరించారు.
వాహనాలను సీజ్ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా యస్.పి తెలిపారు. స్వయంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యస్.బి డి.యస్.పి గంగయ్య , ట్రాఫిక్ డి.యస్.పి లు ముస్తఫా, రమణ కుమార్ సి.ఐ లు సురేష్ కుమార్, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు.