కరోనా కారణంగా తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లల పునరావాసం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ చెప్పారు. విజయవాడ నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు.
ఇందుకు సంబంధించి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్ తో తల్లిదండ్రులు ఇద్దరు హాస్పిటల్ లో చేరితే పిల్లలకు తాత్కాలిక సంరక్షణ కల్పిస్తామన్నారు. ఇందుకు సంబంధించి 181,1098 టోల్ ఫ్రీ నంబర్లు తో హెల్ప్ డెస్క్ ఏర్పాటు అయిందన్నారు.
కరోనా బారినపడి వైద్య చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన, కోవిడ్ కేర్ సెంటర్ లో ఉన్న, హోమ్ ఐసోలేషన్ లో ఉండి తగిన వసతి లేకపోయిన అటువంటి పిల్లలకు చైల్డ్ లైన్ ద్వారా తాత్కాలిక సంరక్షణ అందిస్తున్నామన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాధాలుగా మిగిలిన పిల్లలను చేరదీసి బాలల సంరక్షణ కేంద్రాల్లో రక్షణ కల్పించి పునరావాసం చర్యలు తీసుకుంటామన్నారు.అటువంటి పిల్లల సమాచారాన్ని వారి బంధువులు గాని, చుట్టుపక్కల వారు గాని 108,1098 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చునన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) ఎల్.శివశంకర్, జడ్పీ సీఈఓ సూర్య ప్రకాష్,డియంహెచ్ ఓ డా.యం.సుహాసిని,నోడల్ అధికారి కె.భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.