కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కోటి రూపాయలు తన వంతు సాయంగా ప్రకటించింది. కరోనా (COVID 19) మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. భారతదేశం కూడా కరోనా మహమ్మారి పంజాకు విలవిల్లాడుతోంది. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడే జనజీవనం స్తంభించిపోయింది.
ఓవైపు వైరస్ వ్యాప్తి భయం, మరోవైపు లాక్డౌన్తో జీవనం గడవక జనాలు ఇబ్బందులతో దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. COVID 19 యొక్క వ్యాప్తిని ఎదుర్కోవటానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తమ వంతుగా సాయం అందించాలని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నిర్ణయించింది.
సామాజిక బాధ్యత గలిగిన కార్పొరేట్ సంస్థగా కరోనా నివారణ కోసం కృషిచేస్తున్న ప్రభుత్వాలకు అన్నివిధాలా సాయం అందించేందుకు కంపెనీ యాజమాన్యం సిద్ధంగా ఉందని ప్రకటించింది.
దేశవ్యాప్తంగా హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాష్ట్రాలలో ప్రభుత్వాలు చేపడుతున్న కరోనా నివారణ చర్యలకు 1 కోటి రూపాయలను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కోటి రూపాయలు కింద పేర్కొన్న విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కరోనా సహాయకచర్యల కోసం ఏర్పాటుచేసిన నిధికి అందిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ 30,00,000, తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ 30,00,000, కర్ణాటక ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ 10,00,000, తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ 10,00,000, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ 10,00,000, ఢిల్లీ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ 10,00,000 అందిస్తారు.
ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని,సామాజిక దూరం పాటిస్తూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలని హెరిటేజ్ ఫుడ్స్ విసి, ఎండి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.