వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దివ్యాంగుల మీద ప్రతి జిల్లాలో దాడులు జరుగుతూనే ఉన్నాయని విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు.
ఈ నెల 5వ తేదీన విశాఖపట్నంలో హిడెన్ స్పోర్ట్స్ మానసిక దివ్యాంగుల స్కూల్ ను కూల్చి వేసిన ఘటన దీనికి పరాకాష్ట అని ఆయన అన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఈ సంఘటన ప్రపంచాన్ని కుదిపేసిందని ఆయన అన్నారు.
ఈ సంఘటన వల్ల 200 మంది మానసిక దివ్యాంగులకు విద్య, ఆటలు, ఉపాధి శిక్షణ ఇస్తున్న హిడెన్ స్పోర్ట్స్ స్కూల్ కు నీడ లేకుండా చేశారని ఆయన అన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం కూల్చివేసిన వారి పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటన పై న్యాయం జరగకపోతే రాష్ట్రం లోని దివ్యాంగులు అందరూ కలిసి సంఘటన జరిగిన స్థలంలో నిరసన తెలియచేస్తామని ఆయన హెచ్చరించారు.
మాస్క్ పెట్టుకోవాల్సిందిగా తన సహచరుడికి చెప్పిన ఒక దివ్యాంగ మహిళా ఉద్యోగినిపై నెల్లూరులో పైశాచిక దాడి జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ సంఘటనపై ఇప్పటి వరకు సరైన విచారణ జరగలేదని ఆయన తెలిపారు.
అదేవిధంగా ప్రకాశం జిల్లాలో వాలంటరీగా పనిచేస్తున్న దివ్యాంగరాలును కాల్చి చనిపోయే దానికి కారణం అయిన వారిని ఇప్పటి వరకు ఎటువంటి శిక్ష పడలేదని ఆయన తెలిపారు. ఇట్లాగే చెబుతూ పోతే ప్రతి జిల్లాలో దివ్యాంగుల మీద ప్రతి రోజు ఏదో ఒక దాడి జరుగుతూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మానవ సమాజమే తలదించుకునేలా కనీస మానవ విలువలు కూడా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.