నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసుకు సంబంధించి సీబీఐ విచారణ జరిపించాలని తీర్పు వెలువరించిన రాష్ట్ర హైకోర్టుపై సోషల్ మీడియాలో దారుణమైన వ్యాఖ్యలతో కామెట్లు పెట్టిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు.
హైకోర్టు జడ్జీలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని సుమోటోగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్వీకరించింది. ఈ మేరకు 49 మందికి నోటీసులు జారీ చేశారు. హైకోర్డు జడ్జిలను కించపరుస్తూ పోస్టులు పెట్టినందుకు నోటీసులు జారీ చేసిన వారిలో వైసీపీ బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు.
కరోనా కేసులలో వైద్య సాయం అందించేందుకు డాక్టర్ సుధాకర్ మాస్కులు అడగడం, వాటిని ప్రభుత్వం సరఫరా చేయలేకపోవడం ఆయన దానిపై బహిరంగ విమర్శ చేయడం తెలిసిందే. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ కి చెందిన వ్యక్తి అని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
అనంతరం జరిగిన పరిణామాలలో ఆయన తాగి రోడ్డు పైకి వచ్చారని అందరిని దుర్భాషలాడుతున్నారని చెబుతూ పోలీసులు ఆయనను అర్ధనగ్నంగా చేతులు వెనక్కి కట్టేసి ఆటోలో వేసి తీసుకువెళ్లారు. దీనిపై రాష్ట్ర హైకోర్టు నిజానిజాలను తెలుసుకోవడానికి కేసును సీబీఐకి అప్పగించింది. కేసును సీబీఐకి అప్పగించడంపై జడ్జిలను కించపరుస్తూ దారుణమైన వ్యాఖ్యలతో హైకోర్టు పరువుకు భంగం కలిగించే రీతిలో సోషల్ మీడియాలో కొందరు పోస్టింగులు పెట్టారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు కు న్యాయవాది లక్ష్మీ నారాయణ లేఖ కూడా రాశారు. అయితే కేసును సుమోటో గా స్వీకరించిన హైకోర్టు 49 మంది వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.