వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్ధరాత్రి వేళ మాన్సాస్, సింహాచలం ట్రస్టుల ఛైర్పర్సన్ నియామకంపై ఇచ్చిన జీవో లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.
మాన్సాస్, సింహాచలం ట్రస్టుల ఛైర్పర్సన్ గా సంచయిత ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టేయడమే కాకుండా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా పునర్నియమించాలని కూడా ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
2020 మార్చిలో మాన్సాస్, సింహాచలం ట్రస్టులకు ఛైర్ పర్సన్గా సంచయిత గజపతిరాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
అప్పటి వరకు ఛైర్మన్గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగిస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. వంశపారపర్యంగా వస్తున్న ట్రస్టు కావడం వల్ల వయసులో పెద్దవారు ట్రస్టీగా ఉండాలంటూ సంచయిత నియామకంపై అశోక్ గజపతిరాజు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు.
ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ట్రస్టులకు ఛైర్పర్సన్ను నియమించిందని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
నిబంధనల ప్రకారమే నియమించామని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఇరు పక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం.. అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా తిరిగి నియమించాలని ఇవాళ ఆదేశించింది.