రేపటి వీర హనుమాన్ విజయ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా వీ హెచ్ పీ, భజరంగ్ దళ్ శోభాయాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో వీహెచ్ పీ, భజరంగ్ దళ్ హైకోర్టును ఆశ్రయించాయి.
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్ బన్ హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్రకు అనుమతి ఇస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
అయితే కొన్ని షరతులను హైకోర్టు విధించింది. వీర హనుమాన్ విజయ యాత్రలో 21 మందికి మించవద్దని హైకోర్టు ఆదేశంలో పేర్కొంది.
అదే విధంగా ఒక బైక్ పై ఒక్కరే శోభాయాత్రలో పాల్గొనాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 లోపు శోభాయాత్ర ముగించాల్సి ఉంటుంది.
శోభాయాత్రను వీడియో చిత్రీకరించి నివేదిక సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం ఇచ్చింది.
అదే విధంగా కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని వీహెచ్ పీ, భజరంగ్ దళ్ కు హైకోర్టు ఆదేశం జారీ చేసింది.