ప్రజాప్రతినిధులపై నమోదై ఉన్న క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన కర్నాటక రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది.
మొత్తం 61 మంది ప్రజాప్రతినిధులు, మంత్రులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31న ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలపై కర్నాటక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ విశ్వజిత్ శెట్టి లతో కూడిన బెంచ్ స్టే విధించింది.
కర్నాటకకు చెందిన పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది. కేసు తదుపరి విచారణ జనవరి 29న జరుగుతుంది.
కేసులు ఉప సంహరించడమే కాకుండా ఇప్పటికే విచారణ స్థాయిలో ఉన్న కేసులను కూడా కర్నాటక ప్రభుత్వం ఉపసంహరించుకున్నది.
కోర్టుల్లో జరుగుతున్న విచారణలు కూడా నిలిపివేయాలని ప్రభుత్వం చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది.
కర్నాటక న్యాయ శాఖ మంత్రి జె సి మధుస్వామి, పర్యాటక శాఖ మంత్రి సి టి రవి, వ్యవసాయ శాఖ మంత్రి బి సి పాటిల్ లపై ఉన్న కేసులను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవడం చర్చనీయాంశం అయింది.