జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు హెచ్చరిక
ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులను ఈ నెల 15లోగా చెల్లించకపోతే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు హెచ్చరించింది. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది.
రెండు వారాల క్రితం 494 కేసుల్లో చెల్లింపులు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. కేవలం 25 కేసుల్లోనే చెల్లింపులు చేయడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గ్రామ సర్పంచ్ ఖాతాల్లో వేస్తే గుత్తేదారుకు చెల్లించట్లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు.
వారి వివరాలు ఇస్తే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం స్పష్టం చేసింది. కొన్ని కేసుల్లో ఇప్పటికే విచారణ జరుగుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. విచారణ చేపడితే పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటివరకు ఎవరికెంత చెల్లించారనే వివరాలు ఈ నెల 15లోగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది