గ్రామీణ ప్రాంతాలకు ఉచితంగా హైస్పీడ్ ఇంటర్ నెట్ ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కాదు సుమా. కేరళలో. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే తొలి దశ పూర్తి కాగా ఇప్పుడు రెండో దశ కేబుల్ వర్క్ ప్రారంభం అయింది.
కేరళ రాష్ట్ర ప్రభుత్వ కలల ప్రాజెక్ట్ అయిన దీంట్లో మొదటి దశలో ఆప్టికల్ ఫైబర్ ను 50,000 కిలోమీటర్ల వరకూ వేశారు. తిరువనంతపురంలోని చెరుతిప్పరలోని కెఎస్ఇబి సబ్ స్టేషన్ నుండి టెక్నోపార్క్లోని స్టేట్ డేటా సెంటర్ వరకు 11 కిలోమీటర్ల మార్గంలో ఆప్టికల్ ఫైబర్ లాగే పనులు ప్రారంభించారు.
పైలట్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, మొదటి దశలో 30,000 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కు హైస్పీడ్ ఇంటర్ నెట్ ఉచితంగా ఇస్తారు. దీనికి సంబంధించిన సర్వే ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలోని ఇడుమలక్కుడి, వయనాడ్, ఇడుక్కిల గ్రామ పంచాయితీలలో సర్వేలు పూర్తయిన తరువాత రెండవ దశ ప్రాజెక్టును ప్రారంభించారు.
మొదటి దశగా, రాష్ట్రంలో ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్లు అందించడానికి ప్రభుత్వం ఇప్పటికే 10,000 ప్రభుత్వ కార్యాలయాలను ఎంపిక చేసింది. ఇప్పుడు ప్రారంభించిన ఆప్టికల్ ఫైబర్ పుల్లింగ్ మార్చి నాటికి 10,000 కి.మీ, జూన్ నాటికి 30000 కి.మీ. పూర్తి అవుతుంది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఇంటర్నెట్ హక్కును ప్రకటించిన ప్రభుత్వ విధానంలో భాగంగా కే-ఫోన్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలోని 2 మిలియన్ల కుటుంబాలకు, వెనుకబడిన ప్రాంతాలకు ఉచిత హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ను అందించడం దీని లక్ష్యం. మిగిలిన వారికి చౌకైన ఇంటర్నెట్ అందిస్తారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, రైల్ టెల్, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన SRIT లతో కూడిన కన్సార్టియం ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది.