అఖిల భారత హిందూ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ కమలేష్ తివారి నేడు హత్యకు గురయ్యాడు. లక్నో లోని ఆయన నివాసంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయనను హత్య చేసి వెళ్లారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న అయోధ్య భూ వివాదం కేసులో కమలేష్ తివారి కూడా ఫిర్యాదు దారుడు. కమలేష్ తివారీ సహాయకుడు స్వతంత్ర దీప్ సింగ్ కథనం ప్రకారం ఇద్దరు వ్యక్తులు నేడు కమలేష్ తివారి ఇంటికి వచ్చారు. వారిద్దరూ ఆయనతో మాట్లాడుతుండగా అందులో ఒకడు తనను సిగరెట్ తీసుకురమ్మని బయటకు పంపాడు. వచ్చి చూసే సరికి కమలేష్ తివారి అచేతనంగా పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించినట్లు సింగ్ చెప్పాడు. కమలేష్ తివారి హత్య విషయం దావానలంలా ఉత్తరప్రదేశ్ మొత్తం వ్యాపించడంతో పోలీసులు అదనపు బలగాలను దించి లక్నోలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కమలేష్ మృతదేహాన్ని పోస్టు మార్టంకు పంపారు. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ కమలేష్ తివారి ఎలా చనిపోయింది కచ్చితంగా చెప్పలేమని పోలీసులు అంటున్నారు. కమలేష్ తివారీ ఇంటి నుంచి ఒక తుపాకిని బుల్లెట్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కమలేష్ తివారి గతంలో ప్రాఫిట్ మెహమ్మద్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ ముస్లింలు ఆందోళన చేయడంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనను విమర్శిస్తున్న ముస్లింలపై మళ్లీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో కమలేష్ తివారిపై నాసాచట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే 2016 లో ఆయనపై అలహాబాద్ హైకోర్టు నాసా చట్టం కొట్టివేసింది. లక్నో రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఎస్ కె భగత్ మాట్లాడుతూ తెలిసిన వారే ఈ హత్య చేసి ఉంటారని ఎందుకంటే తివారితో వారు గంట సేపు మాట్లాడారని అన్నారు. తివారి గొంతు చుట్టూ గాట్లు ఉన్నాయని అయితే మరణానికి కారణం పోస్టు మార్టం రిపోర్టు తర్వాతే చెప్పగలుగుతామని ఆయన అన్నారు.