విధి నిర్వహణలో కఠినత్వాన్నే కాదు సమయాన్ని బట్టి మానవత్వాన్ని ప్రదర్శిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు నల్లగొండ జిల్లా పోలీసులు….
నల్లగొండ జిల్లా చండూర్ పోలీస్ స్టేషన్ కు శనివారం ఉదయాన్నే ఎదో పని నిమిత్తం వచ్చిన ఒక వృద్ధురాలిని గమనించిన హోమ్ గార్డు రమేష్ ఆమె వద్దకు వెళ్లి ఎందుకు వచ్చిందో తెలుసుకోవడమే కాకుండా ఆమె క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు.
ఇదే క్రమంలో తాను రాత్రి అన్నం తినలేదని, ఉదయాన్నే ఏమీ తినకుండా తన పని నిమిత్తం పోలీస్ స్టేషన్ కు వచ్చునట్లుగా చెప్పడంతో హోమ్ గార్డు రమేష్ టిఫిన్ తీసుకురావడమే కాక తానే స్వయంగా వృద్ధురాలికి తినిపించారు.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించి సామాజిక మధ్యమాలలో పోస్టు చేశారు. ఈ ఫొటోకు నెటిజన్ల నుండి విశేషమైన స్పందన రావడమే కాదు….. ఆయన ప్రదర్శించిన మానవత్వం పట్ల అభినందనలు తెలుపుతూ శభాష్ తెలంగాణ పోలీస్ అంటూ కామెంట్లు పెట్టారు.
మానవతా హృదయంతో వృద్ధురాలి ఆకలి తీర్చిన హోమ్ గార్డు రమేష్ కు అభినందనలు వెల్లువెత్తాయి. కాగా హోమ్ గార్డు చూపిన చొరవ, మానవత్వం పట్ల డిఐజి ఏ.వి. రంగనాధ్, అదనపు ఎస్పీ నర్మద, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, చండూర్ సిఐ బి. సురేష్ కుమార్, ఎస్.ఐ. ఉపేందర్ రెడ్డి, సిబ్బంది అభినందనలు తెలిపారు.
విధి నిర్వహణలో ఎన్నో రకాల పనివత్తిడి ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్ కు వచ్చే పిర్యాదు దారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ కు నిజమైన నిర్వచనం ఇస్తున్నారు నల్లగొండ జిల్లా పోలీసులు.