28.7 C
Hyderabad
April 20, 2024 06: 43 AM
Slider ప్రత్యేకం

కోవిడ్ నియంత్రణకు ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించాలి

#ministerharishrao

కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గ్రామాల వారీగా, వార్డుల వారీగా టీం లను ఏర్పాటు చేసి ప్రతిరోజు 25 ఇండ్లలో ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో సంబంధిత ఆశా వర్కర్/ ఏ.ఎన్.ఎం, మున్సిపల్/ గ్రామ పంచాయతి సిబ్బందితో టీం ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

సర్వే టీంలు ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో ఎవరైన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా అడిగి తెలుసుకోవాలని, కోవిడ్ లక్షణాలతో బాధపడే వారుంటే వారిని గుర్తించి హోమ్ ఐసోలేషన్ కిట్ ను వెంటనే ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్ లోని మందులు చాలా బాగా పనిచేస్తున్నాయని, 5 రోజులు వాడితే సరిపోతుందని ఆయన తెలిపారు.

ప్రతి ఇంటి సభ్యుల ఆరోగ్య విషయాలను చర్చించి వ్యాక్సిన్ రెండు రోజుల వివరాలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యల పై వాకబు చేయాలని సూచించారు. ఐసోలేషన్ కిట్ ఇచ్చిన వారిని సర్వే టింలు ప్రతిరోజు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. 5 రోజుల తర్వాత కూడా దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రులలో చేర్పించాలని ఆదేశించారు.

గత అనుభవంతో ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. గతంలో నిర్వహించిన ఇంటింటి సర్వే ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణకు మంచి పేరు వచ్చిందని నీతి అయోగ్ సైతం ప్రశంసించిందని మంత్రి వెల్లడించారు. కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు.

రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా 70 శాతం వ్యాక్సినేషన్ మాత్రమే పూర్తి అయ్యిందని మిగతా 30 శాతం వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అదే విధంగా 15-18 సంవత్సరముల వారికి మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకొని అర్హులైన వారందరికి వంద శాతం వ్యాక్సినేషన్ చేయించాలని అన్నారు.

అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి బూస్టర్ డోస్ వేయించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ ఓ.పి. సేవలను నిర్వహించాలని ఆదేశించారు. కోవిడ్ లక్షణాలున్న వారందరికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందజేయాలని అన్నారు.

అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ టెస్టింగ్ కిట్స్, హోమ్ ఐసోలేషన్ కిట్స్, మందుల నిల్వలు ఉన్నాయని, లేనిచో వెంటనే ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సౌకర్యంతో కోవిడ్ వార్డులను ఏర్పాటు చేసామని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లతో రివ్యూ చేయాలని ఆదేశించారు.

కోవిడ్ రోగులకు మంచి పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని ఆదేశించారు. 200 రూపాయలకు భోజన చార్జీలను పెంచడం జరిగిందని తెలిపారు. పోలిస్ కమిషనర్లు, పోలిస్ సూపరింటెండెంట్లు  ప్రజలందరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాల పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల అడ్మిషన్లకు చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్ కు  మంత్రి సూచించారు.

పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామానికి ఒక నోడల్ ఆఫిసర్ ను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో ఆశా/ ఏ.ఎన్.ఎం.లతో గ్రామ పంచాయతి కార్యదర్శి, ఇతర అధికారుల సమన్వయంతో ఇంటింటి జ్వరం సర్వేను విజయవంతం చేయాలని అన్నారు.

జ్వరంతో బాధపడుతున్న వారికి తో ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వారికి ధైర్యం చెప్తూ ఔషధాలను అందించడంతో పాటు ప్రతిరోజు పర్యవేక్షించాలని సూచించారు.

ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ ఇంతవరకు కోవిడ్ తో మరణించిన వారికి ప్రభుత్వం చెల్లించు ఎగ్జి గ్రేషియా (ఆర్థిక సహాయం) త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎగ్జి గ్రేషియా మంజూరుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఉన్నవని అన్నారు.

మీ సేవ ద్వారా ధరఖాస్తు చేసుకున్న కేసులను కమిటీ వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. కోవిడ్ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని అన్నారు. కోవిడ్ సెంటర్లలో ఉన్న రోగులకు పౌష్టికాహారంతో కూడిన ఆహారం అందించాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్సులో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి జిల్లాలో చేపట్టనున్న ఇంటి ఆరోగ్య సర్వే నాగర్ కర్నూలు జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తామని, రెండోవ డోస్ వ్యాక్సిన్ను 100% లక్ష్యాన్ని పూర్తి చేస్తామని జిల్లాలో కరోన కేసుల నియంత్రణకు ముందస్తు ప్రణాళిక పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ వివరించారు.

ఉయ్యాలవాడ, తాడూరులో  కొవిడ్ కేర్ సెంటర్ ను సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. జిల్లాలో కరోన నియంత్రణకు పోలీస్ శాఖ తో సమన్వయంతో పనిచేస్తూ కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధాకర్ లాల్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాయినాథ్ రెడ్డి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం,  డాక్టర్ రోహిత్ అదనపు డి ఎం హెచ్ ఓ వెంకట దాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సింహపురి ఎక్స్ప్రెస్ వేళను గంటపాటు తగ్గించండి

Bhavani

టేకు లక్ష్మి కేసులో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావాలి

Satyam NEWS

మంట రగిల్చిన మంత్రి వర్గ విస్తరణ: ఒకరు ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment