ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న నిజామాబాద్ మాజీ ఎంపి, టీఆర్ఎస్ ముఖ్య నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆరోగ్య పరిస్థితి పై చాలా మంది క్లారిఫికేషన్ కోసం చూస్తున్నారు. ఆమె డ్రైవర్ కు కరోనా పాజిటీవ్ రావడంతో కవిత ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఐసోలేషన్ లో ఉన్న కవిత అందరిలాగా తన ఆరోగ్యం గురించి వీడియో మెసేజ్ పెట్ట పద్ధతి కాకుండా తాను ఆరోగ్యంగా ఉన్న విషయాన్ని చెప్పకుండానే చెప్పారు.
ఆమె ఏం చేశారంటే బిఎస్ సి ఫారెస్ట్రీ చదువుతున్న సూర్య దీపిక, సుహర్షా అనే ఇద్దరు విద్యార్ధినిలు అమెరికాలోని అబోరన్ యూనివర్సిటీ లో మాస్టర్స్ కోర్సులో సీటు పొందడమే కాకుండా ట్యూషన్ ఫీజు మాఫీ, ఇతర స్కాలర్ షిప్ లు పొందారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సుహర్షాతో కవిత నేడు మాట్లాడారు.
ట్విట్టర్ లో వీడియో పోస్టు చేశారు. సుహర్ష అమెరికాలో చదవ బోయే ప్రాంతానికి దగ్గరలోనే తానూ చదివానని, పత్రికల్లో సుహర్ష వార్త చదవగానే తనకు ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చాయని కవిత చెప్పారు. తనకు కూడా స్కాలర్ షిప్ వచ్చిందని, తన చదువు కూడా స్కాలర్ షిప్ పైనే సాగిందని కవిత గుర్తు చేసుకున్నారు. సుహర్ష తల్లిదండ్రులతో కూడా కవిత మాట్లాడారు. ఈ వీడియోను పోస్టు చేసి కవిత తన ఆరోగ్య పరిస్థితిని పరోక్షంగా చెప్పారు.