కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, వివిధ విజిలెన్స్ టీమ్ ల ద్వారా అక్రమంగా తరలిస్తున్న 1,45,20,727 నగదును పట్టుకుని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా అక్రమ డబ్బు, మద్యం రవాణాను అరికట్టేందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, అలాగే స్టాటిక్ సర్వే లెన్స్ టీములు, ఫ్లయింగ్ టీములను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించగా, భారీ ఎత్తున నగదు, మద్యం పట్టుబడినట్లు తెలిపారు. ఇంతవరకు 1,45,20,727 రూపాయల నగదు, 1,50,000 రూపాయల విలువగల 30 గ్రాముల బంగారం, 9,10,000 రూపాయల విలువ గల 14 కిలోల వెండి, 5,11,652 రూపాయల విలువగల 867 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు వివరించారు. అలాగే 2,21,000 రూపాయల విలువగల 66 చీరలు, 50 షర్టులను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వీటితోపాటు 19,750 రూపాయల విలువ గల 3.51 కిలోల గంజాయిని పట్టుకొని సీజ్ చేసినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.