శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు 99 వేల రూపాయలు విలువగల 33 కిలోల గంజాయి పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ వివరాలను సర్కిల్ ఇన్స్పెక్టర్ డివివి సతీష్ కుమార్, పట్టణ ఎస్సై కే గోవిందరావు తో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వారందించిన వివరాల ప్రకారం…ఇచ్చాపురం సరిహద్దులోని పురుషోత్తపురం గ్రామ స్మశానం పరిసరాలలో ముగ్గురు వ్యక్తులు అనుమానంస్పదంగా సంచరిస్తున్నారనే సమాచారం పట్టణ పోలీసులకు అందింది.
వెంటనే పోలీస్ సిబ్బంది అనుమానస్పదంగా మూడు సంచులను కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద 33 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ 99 వేల రూపాయలుగా లెక్క కట్టారు.ఈ కేసులో ఒడిస్సా సుమండి గ్రామానికి చెందిన ఘన శ్యాం బెహర, పురుషోత్తపురం గ్రామానికి చెందిన రెయ్యి త్రినాథ్, పైల వాసుదేవ్ లను అరెస్టు చేశారు. గంజాయి పండించే రైతులు వద్ద నుండి ఘన శ్యామ్ బెహరా గంజాయి కొనుగోలు చేసి, పురుషోత్తపురం కు చెందిన త్రినాథ్, వాసులకు అమ్మకం చేస్తాడు. వారు గంజాయిని చిన్న పొట్లాలుగా మార్చి జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లకు, సిబ్బందికి అమ్మకం చేస్తూ ఉంటారని సీఐ వివరించారు.