ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అదీ సొంత నియోజకవర్గం అయిన పులివెందుల నుంచి వస్తున్న కారులో భారీగా బంగారం బయటపడ్డది.
పంచాయతీ ఎన్నికల వేళ కడప జిల్లాలో భారీగా బంగారం పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
కడప జిల్లాలోని కడప- తాడిపత్రి ప్రధాన రహదారిలోని ముద్దనూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పులివెందుల నుంచి వస్తున్న ఒక కారులో 2.7 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
సీఐ హరినాథ్ తెలిపిన వివరాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ముద్దనూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద వాహనాల తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో పులివెందుల నుంచి ముద్దనూరు వైపు వస్తున్న ఓ కారును నిలిపివేశారు.
ఈ సందర్భంగా కారులో తనిఖీ చేపట్టగా.. అందులో ఉన్న రెండు బ్యాగుల్లో 2.7 కేజీల బంగారు ఆభరణాలను గుర్తించారు.
వెంటనే కారు డ్రైవర్ మహమ్మద్ షఫీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. పులివెందులలోని ఓ బంగారు ఆభరణాల దుకాణం నుంచి మెరుగు పెట్టించడానికి ప్రొద్దుటూరుకు తీసుకెళుతున్నట్లు చెప్పాడు.
అయితే ఆభరణాలకు సంబంధించిన బిల్లులు లేకపోవటంతో కారుతో పాటు ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.1.05 కోట్లు ఉంటుందని సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను తిరుపతి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అందించినట్లు సీఐ హరినాథ్ తెలిపారు.